: యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై మోదీ డేగకన్ను.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి పర్యవేక్షణ బాధ్యత!

ఉత్తరప్రదేశ్‌ లో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీహార్ పై మోదీ విపరీతమైన ప్రేమ చూపించి, ఎన్నికల సమయంలో వరాల జల్లు కురిపించారు. దీంతో బీహార్ లో విజయం తమనే వరిస్తుందని ఆశించారు. అయితే, బీహారీలు మోదీని నమ్మలేదు. దీంతో నితీష్-లాలూ కూటమి అధికారం చేపట్టింది. ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ఓట్లు ప్రభావవంతంగా ఉండడంతో యూపీలో విజయం చాలా కష్టమని దేశవ్యాప్తంగా అన్ని వార్తాసంస్థలు, సర్వే ఏజెన్సీలు ఎన్నికల ప్రచారం సమయంలో పేర్కొన్నాయి.

అయితే ఊహించని మెజారిటీతో యూపీని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో యూపీపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ప్రధాని నిర్ణయించారు. అదీ కాక యూపీకి ముఖ్యమంత్రిగా వివాదాస్పద మత గురువుగా పేరొందిన ఆదిత్యనాథ్ ను ఎంపిక చేయడంతో వివాదాలు చుట్టుముట్టకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూపీలో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై నిఘా పెట్టాలని భావిస్తున్నారని సమాచారం.

దీంతో ఈ నిఘాను సమర్థవంతంగా నిర్వహించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నృపేంద్ర మిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది. దీంతో పీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అయిన మిశ్రా సీఎం యోగి ఆదిత్యనాథ్ తో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి, సీఎం యోగికి మధ్య దూతగా మిశ్రా వ్యవహరించనున్నారని, ఆయన నిత్యం యోగితో టచ్ లో ఉంటూ, యూపీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇండియా టుడే ప్రత్యేక కథనం రాసింది. అందులో యూపీ కేడర్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ప్రత్యేకంగా కేంద్రానికి పిలిపించుకున్నారని పేర్కొంది. యూపీ ప్రభుత్వం భవిష్యత్ లో చేపట్టబోయే నియామకాలన్నీ మిశ్రా ధ్రువీకరించిన తరువాతనే చేపట్టనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News