: శోభన్ బాబు లాంటి నటుడిని మళ్లీ చూడలేము: నటి వాణిశ్రీ

శోభన్ బాబు లాంటి అందాల నటుడిని, అంత మంచి వ్యక్తిని మళ్లీ తాను చూడలేమని సీనియర్ నటి వాణిశ్రీ అన్నారు. విజయవాడలో నిర్వహించిన శోభన్ బాబు వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఏలూరు లాకుల సెంటర్ లోని శోభన్ బాబు విగ్రహానికి ఆమె పూలమల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

అనంతరం, వాణిశ్రీ మాట్లాడుతూ, శోభన్ బాబుతో నటించినందుకు తాను ఎంతో గర్విస్తున్నానని, అందాల నటుడు శోభన్ బాబు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. సినీ పరిశ్రమలో తన పని తాను చేసుకుంటూ వెళ్లిన మహోన్నత వ్యక్తి శోభన్ బాబు అని, చాలా గొప్పగా జీవించారని అన్నారు. శోభన్ బాబు లాంటి వ్యక్తిని మళ్లీ చూడగలనా? అని అనుకుంటానని, అంతలోనే అటువంటి వ్యక్తిని మళ్లీ చూడలేనని కూడా అనిపిస్తుందని ఆమె అన్నారు. శోభన్ బాబు తనతో చాలా కలివిడిగా ఉండేవారని, ఒక కుటుంబ సభ్యురాలిగా తనను చూసేవారంటూ నాటి విషయాలను వాణిశ్రీ గుర్తు చేసుకున్నారు.

More Telugu News