: పన్నీర్‌ సెల్వం కుటుంబానికి భారీగా ఆస్తులు.. ఎంక్వైరీ కమిషన్‌ వేస్తాం: టీవీవీ దినకరన్‌

అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టీవీవీ దినకరన్ తమకు వ్యతిరేకంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంపై ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. ప‌న్నీర్‌తో పాటు ఆయ‌న‌ కుటుంబసభ్యులకు దేశ, విదేశాల్లో భారీగా వ్యాపారాలు ఉన్నాయని, వాటిపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. అందుకోసం త్వ‌ర‌లోనే ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2000 సంవత్సరంలో పన్నీర్‌ సెల్వాన్ని తానే జయలలితకు పరిచయం చేశానని దిన‌క‌ర‌న్ అన్నారు. కేవలం కొన్ని సంవ‌త్స‌రాల‌కే ప‌న్నీర్ సెల్వం ఆస్తులు అంత‌గా ఎలా పెరిగిపోయాయని ఆయ‌న నిల‌దీశారు.

ప‌న్నీర్ సెల్వం 2001లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయ‌న‌కు ఉన్న ఆస్తుల గురించి త‌న‌కు తెలుస‌ని దినకరన్ అన్నారు. ప‌న్నీర్ సెల్వం ప‌దే ప‌దే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో త్వరలోనే ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటుచేసి తేల్చుతామ‌ని అన్నారు. అలాగే ప‌న్నీర్ కుటుంబ స‌భ్యులు కూడా త‌రచూ చెన్నై నుంచి ఢిల్లీకి, విదేశాలకు ఎందుకు వెళుతున్నారో తేల్చి చెబుతామ‌ని అన్నారు.

More Telugu News