: అదృష్టం ఉండటంతోనే నాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు: కన్నా లక్ష్మీనారాయణ

కేవలం అదృష్టం వల్లే నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ప్రస్తుత బీజేపీ నేత, మాజీ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు నాటి పరిస్థితులను ప్రస్తావించారు. ‘ఒక దశలో నేను సీఎం అభ్యర్థిని. అయితే, అప్పటి నుంచే నాకు కాంగ్రెస్ లో బ్యాడ్ మొదలైంది. ఆ కారణంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను. నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నాకు కబురు పంపి, సీఎం బాధ్యతలు స్వీకరించేందుకు రెడీగా ఉండమని చెప్పింది. నేను ఆ పదవి కావాలని అడగలేదు, ప్రయత్నం చేయలేదు. ఒకవేళ అడిగినా ఆ పదవి ఇచ్చేది కాదు. అయితే, అధిష్ఠానం నన్ను పిలిచిన తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో ఇక ఉండకూడదనే నిర్ణయానికి వచ్చి నాడు బయటకు వచ్చేశాను. కిరణ్ కుమార్ రెడ్డితో నాకు తేడా ఏం లేదు కానీ, నన్ను అధిష్ఠానం పిలిచిన తర్వాతే కిరణ్ కుమారే నన్ను బాగా సాధించాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కేవలం ఆయన అదృష్టమే’ అని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

More Telugu News