: మీరు సస్పెండ్ చేస్తే మేం చూస్తూ కూర్చుంటామా?: వైసీపీ హెచ్చరిక

వైసీపీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనను విరమించుకోకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ హెచ్చరించింది. విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, విశ్వేశ్వరరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. మహిళలపై దాడులకు దిగుతున్న టీడీపీ నేతలు చింతమనేని, పయ్యావుల కేశవ్‌ వంటివారికి వ్యతిరేకంగా రోజా పోరాడుతున్నారనే ఆమెపై టీడీపీ కక్ష పెంచుకుందని ఆరోపించారు.

చేయని తప్పుకు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన టీడీపీ మరో ఏడాదిపాటు దానిని పొడిగించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. అదే జరిగితే చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. జరిగిన ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు సభాహక్కుల సంఘం ఎదుట రోజా చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆమె మనస్ఫూర్తిగా చెప్పలేదంటూ నివేదిక ఇవ్వడం కమిటీ గౌరవానికే చెడ్డపేరని వ్యాఖ్యానించారు. స్పీకర్ అనుమతి లేకుండా సభ లోపలి వీడియోలను బహిర్గతం చేసిన కాల్వ శ్రీనివాసులపై చర్య తీసుకోవాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పకుండా వివక్ష కిందికే వస్తుందన్నారు.

More Telugu News