: ఉగాది విషయంలో విడిపోయిన ఏపీ, టీఎస్!

ఉగాది పండగను 28న జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా, 29న సెలవు ప్రకటిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఈ వైఖరి తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర అయోమయంలోకి నెట్టివేసిందని సిద్ధాంతులు చెబుతున్నారు. పంచాంగ కర్తల గణనాల్లో తేడాల కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని అంటున్నారు. మార్కెట్లో నాలుగు రకాల పంచాంగాలు ఉండటం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము నమ్మిన పురోహితుల మాటలను వినడంతోనే ఈ సమస్య ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ నెల 28న ఉదయం 8 గంటల తరువాత నుంచి హేవిలంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ప్రవేశిస్తుండగా, ఆ మరుసటి రోజు... అంటే 29న సూర్యోదయం కాకుండానే విదియ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు సూర్యోదయాలూ లేకుండా తిథులు వచ్చినప్పుడు తొలి రోజు మాత్రమే పండగ చేసుకోవాలని అత్యధికులు సూచిస్తున్నారు. ఈ ప్రకారం 28న పండగ జరుపుకోవాలని పిలుపునిస్తుండగా, తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ ఆధారంగా, ఏపీ ప్రభుత్వం 29న సెలవును ప్రకటించనుంది. దీంతో ఉగాది తేదీపై సస్పెన్స్ మరింత పెరుగగా, పాడ్యమి తిథి లేని సమయంలో పంచాంగ శ్రవణం కూడదని, కనీసం ఉగాది పచ్చడి తినే వేళకు కూడా పాడ్యమి ఉండని రోజున ఉగాది ఎందుకు జరుపుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News