: పన్ను ఎగవేతదారులను రచ్చకీడుస్తున్న ఐటీ.. 29 మంది డిఫాల్టర్ల పేర్లు వెల్లడి.. వారిలో 14 మంది తెలుగువారే!

పన్ను ఎగవేతదారులను రచ్చకీడ్చేందుకు ఆదాయపన్ను శాఖ రెడీ అయింది. ఇప్పటి వరకు బతిమాలి, బుజ్జగించి పన్ను చెల్లించాలని కోరినా డిఫాల్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో వారి పరువును బజారున పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 29 మంది ఎగవేతదారుల పేర్లను వెల్లడించింది. వారిలో 14మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం గమనార్హం. ఈ 14 మందిలో 9 మంది హైదరాబాద్ చిరునామాను పేర్కొనగా, ఐదుగురు విశాఖపట్టణం చిరునామాతో ఉన్నారు. బకాయిల్లో వీరి వాటా రూ.55.72 కోట్లు. ఇక మొత్తం 448.02 కోట్ల బకాయిల్లో సగానికిపైగా ఒకే వ్యక్తి పేరున ఉన్నాయి. 29 మంది డిఫాల్టర్లలో 26 మంది ‘ఆచూకీ తెలియని’ వ్యక్తులు/ సంస్థల జాబితాలో ఉండడం గమనార్హం.

ఐటీ జాబితాలోని 29 మంది 1983-84 నుంచి 2012-13 మధ్య అసెస్‌మెంట్ సంవత్సరాల్లో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆదాయపన్ను శాఖ చెబుతోంది. లక్నోకు చెందిన ఇర్ఫాన్ హబీబ్ రూ.257.44 కోట్ల పన్ను బకాయిలు కలిగివున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. 2005-06 నుంచి 2008-09 సంవత్సరాలకు సంబంధించి ఇర్ఫాన్ పన్ను ఎగవేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌‌కు చెందిన ఇన్ఫోనిటీ నాలెడ్జ్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ గరిష్టంగా రూ. 12.33 కోట్లు బకాయి పడింది. ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఇన్వెస్టిమెంట్స్ అనే మరో సంస్థ రూ.9.82 కోట్లు బకాయిపడింది. సువర్ణ ఫిల్టర్‌ అండ్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ రూ.5.36 కోట్లు బకాయి పడగా, విశాఖపట్టణానికి చెందిన జేఎల్‌కే ఆర్క్‌సాఫ్ట్‌ అనే సంస్థ రూ.8.11 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. మిగతా సంస్థల బకాయిలు రూ.1-2 కోట్ల మధ్య ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పన్ను ఎగవేతదారుల్లో 12 మంది వ్యక్తులు/సంస్థల ఆచూకీ తెలియడం లేదని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మరో ఇద్దరి విషయంలో వారి ఆస్తులు రికవరీకి సరిపోవని తెలిపారు.

More Telugu News