: మార్కెట్లో రిలయన్స్ జియో హవాలో మార్పులుండవు: ఓ రీసెర్చ్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వ‌చ్చిన రిల‌య‌న్స్ జియో వ‌చ్చేనెల నుంచి టారిఫ్ ప్లాన్ల‌ను అమ‌లులోకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జియో ఉచిత ఆఫ‌ర్లు ముగియ‌గానే వినియోగ‌దారులు ఆ సిమ్ కార్డుల‌ను తీసి ప‌క్క‌కు పెట్టేస్తార‌ని ఎన్నో ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే, బ్రోక‌రేజ్ కంపెనీ బెర్న్ స్టెయిన్ నిర్వ‌హించిన ఓ రీసెర్చ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. ఈ రీసెర్చ్‌లో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన యూజ‌ర్లు, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు పాల్గొన్నారు.

ఈ రీసెర్చ్ ద్వారా రిల‌య‌న్స్ జియోకు క‌స్ట‌మ‌ర్లు జై కొడుతూనే ఉంటార‌ని తేలింద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. కేవలం 8 శాతం మంది జియో వినియోగ‌దారులు మాత్రమే ఆ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అంతేకాదు, జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తేనే అలా చేస్తామ‌ని అన్నారు. రిల‌య‌న్స్ జియో మంచి  సర్వీసు, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ అందిస్తోంద‌ని వినియోగ‌దారులు తెలిపారు. వ‌చ్చే నెల 1 నుంచి ఆ కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్లుగా నెలకు రూ.303 రీఛార్జీ చేసుకుని ఆ సిమ్‌నే సెకండ‌రీ సిమ్‌గా వాడ‌తామ‌ని 67 శాతం మంది యూజర్లు తెలిపారు. దీంతో ఉచిత ఆఫ‌ర్లు లేక‌పోయిన‌ప్ప‌టికీ జియో వినియోగ‌దారులు జియోవైపే ఉన్నార‌ని రీసెర్చ్ ద్వారా పేర్కొన్నారు. ఈ రీసెర్చ్‌ను వెయ్యిమంది శాంపుల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ నిర్వ‌హించింది.

More Telugu News