: యూపీ పరాజిత ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్న ‘మోదీ మ్యాజిక్’!

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 300 పైచిలుకు స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గెలుపు తథ్యమని భావించిన ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇప్పుడు ‘మోదీ మ్యాజిక్’ మరోసారి ఇబ్బంది పెడుతోంది. అయితే ఈ ‘మోదీ మ్యాజిక్’కు, ప్రధాని మోదీకి ఎటువంటి సంబంధం లేదు.

ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలను అధికారిక బంగళాల నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అనంతరం వాటికి ఓ తాళం వేస్తున్నారు. ఆ తాళంపై ‘మోదీ మ్యాజిక్’ అని ఉండడం చూసి పరాజిత ఎమ్మెల్యేల ఒళ్లు మండిపోతోంది. ఎన్నికల్లోనూ, బంగళాలోనూ కూడా మోదీ మ్యాజిక్కే ఎదురైందని వాపోతున్నారు. తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన యూపీలోని అలీగఢ్‌లోని ఓ కంపెనీ ‘మోదీ మ్యాజిక్’ పేరుతో డబుల్ లాకింగ్ ఫీచర్ ఉన్న తాళాలను తయారుచేస్తోంది. అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యేల క్వార్టర్లకు వాటినే ఉపయోగిస్తున్నారు.

More Telugu News