: ఐపీఎల్ టికెట్ల విక్రయాలకు సర్వం సిద్ధం.. సచిన్ స్టాండ్ టికెట్ ధర రూ.8 వేలు

ఐపీఎల్-10 సీజన్ టికెట్ల విక్రయాలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరగనుండగా సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌ల టికెట్లను జియో మనీతో కలిసి ముంబై ఇండియన్స్ జట్టు నిర్వాహకులు విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి టికెట్ల అమ్మకాలు మొదలుకానున్నాయి. వాంఖడే స్టేడియంలోని సునీల్ గవాస్కర్ స్టాండ్‌లోని టికెట్ ధరను రూ.800, సచిన్ టెండూల్కర్ హాస్పిటాలిటీ స్టాండ్‌లోని టికెట్ ధరను రూ.8 వేలుగా నిర్ణయించారు. కార్పొరేట్ బాక్స్‌లోని టికెట్ ధరలు రూ.12 వేల నుంచి రూ.30వేల మధ్యలో ఉన్నాయి. బాక్సాఫీసు ధరను త్వరలో నిర్ణయించనున్నారు.

కాగా, ఏప్రిల్ 9న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో క్రికెట్ లెజెండ్ సచిన్, స్పిన్నర్ హర్భజన్ సింగ్, నీతా అంబానీ బిజీగా ఉన్నారు. ఇక 16న జరగనున్న మ్యాచ్‌కు పేద విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. మ్యాచ్ చూసేందుకు వారికి ఎన్జీవోలు సాయం అందించనున్నారు. కాగా, ఉప్పల్‌లో ఐపీఎల్ ప్రారంభ వేడుకల అనంతరం డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

More Telugu News