: దిగ్విజయ్‌పై గోవా పీసీసీ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్‌, గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌పై గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(జీపీసీసీ) అధ్యక్షుడు లుయిజినో ఫలీరో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం వారేనని ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాల కారణంగానే ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ విఫలమైంది.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే మద్దతు ఉన్నప్పటికీ  గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూద్దామని దిగ్విజయ్ సింగ్ తనతో చెప్పారని, అందుకే వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ఫలితాలు వచ్చిన రోజు రాత్రి పోర్వోరిమ్ స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖాంటే, బెనాలిమ్ ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలేమావో సహా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు లభించిందని లుయిజినో వివరించారు. అయితే వారి నుంచి సంతకాలు మాత్రం తీసుకోలేదని తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 21 మంది ఎమ్మల్యేల మద్దతు ఉన్నప్పటికీ గవర్నర్ పిలుపు కోసం వేచి చూడాలని దిగ్విజయ్ సింగ్ సూచించారని, అదే తమ కొంప ముంచిందని పేర్కొన్నారు. ఈలోగా బీజేపీ చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసిందన్నారు. ఈ విషయంలో తాను ఎవరినీ వేలెత్తి చూపాలని అనుకోవడం లేదని లుయిజినో పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు తాను ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునేవాడినని వివరించారు.

More Telugu News