: రూ.2 వేల నోటును రద్దు చేయబోం: అరుణ్ జైట్లీ
గత ఏడాది నవంబరు నుంచి చలామణిలోకి వచ్చిన కొత్త రూ.2 వేల నోటును రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని లిఖితపూర్వక సమాధానంలో తేల్చిచెప్పారు. అలాగే పాత నోట్ల రద్దు తర్వాత గత ఏడాది డిసెంబరు 10, 2016 నాటికి మొత్తం రూ.12.44 లక్షల కోట్ల రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరాయని అన్నారు. ఈ ఏడాది జనవరి 27 నాటికి రూ.9.921 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందని, అయితే, మార్చి 3 నాటికి రూ.12 లక్షల కోట్లు పెరిగిందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు అనంతరం విధించిన బ్యాంకు ఖాతాల్లో నగదు ఉపసంహరణ ఆంక్షలను క్రమంగా తొలగించామని అన్నారు.