: ఆ విషయంలో భారత్ కంటే చైనా ఎంతో ముందంజలో ఉంది: ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2030 నాటికి ఈ దేశాలే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటాయని కూడా పలు సంస్థలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయితే, పలు రంగాల్లో చైనాకి గట్టిపోటీనిస్తోన్న భారత్.. డిజిటల్ స్పేస్ లో మాత్రం ఆ దేశం కంటే ఎంతో వెనకబడిపోయింది. తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ రెండు దేశాల్లో చైనా శరవేగంగా దూసుకెళుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకంలో చైనా ముందంజలో ఉందని, గత ఏడాది దాకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉందని అందులో పేర్కొన్నారు.
చైనాలో 71 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా మనదేశంలో మాత్రం 21 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారని అందులో చెప్పారు. చైనాలో 68 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతుండగా మనదేశంలో 18 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. 2013 నుంచి చైనాలో స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ 31 శాతం పెరిగితే ఆ సమయంలో భారత్ లో మాత్రం 6 శాతమే పెరిగిందని సర్వే ద్వారా తెలిసింది. కాగా, బేసిక్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నవారు ఆ దేశంలో 98 శాతం మంది ఉంటే మనదేశంలో 72 శాతం మంది మాత్రమే ఉన్నారు. చైనాలో 72 శాతం మంది పట్టణ ప్రాంత ప్రజలు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 63 శాతం మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నాయని తెలిపింది. ఇక మనదేశంలో మాత్రం పట్టణ ప్రాంతాల్లో 29 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13 శాతం మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.