: ఓటు హక్కును వినియోగించుకున్న జగన్.. చంద్రబాబు సిగ్గుపడాలంటూ తీవ్ర విమర్శలు

కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ తన ఓటు హక్కును జమ్మలమడుగులో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలో మొత్తం 841 మంది ఓటర్లు (స్థానిక సంస్థల ప్రతినిధులు) ఉంటే అందులో వైసీపీ గుర్తు మీద గెలిచిన వారు 521 మంది ఉన్నారని, మిగిలిన వారు టీడీపీ వారు అని చెప్పారు.

 తమకు గెలిచే అవకాశం ఏమాత్రం లేకున్నా టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు. వైసీపీకి ఉన్న మెజారిటీ నేపథ్యంలో అసలు ఇక్కడ ఎన్నికలు జరగాల్సిన అవసరమే లేదని... అయితే, దిగజారుడు రాజకీయాలతో ఎన్నికలను తీసుకొచ్చారని... దీనికి చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. తమ పార్టీ సభ్యులను కొనుగోలు చేసి, వారితో ఓట్లు వేయించుకుంటున్నారని అన్నారు. ఓటర్లంతా నైతిక విలువలు పాటించాలని, ఏ పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటే, ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని సూచించారు. 

More Telugu News