: ఇక్క‌డ రౌడీయిజం జ‌ర‌గ‌డానికి వీల్లేదు.. గుర్తుపెట్టుకోండి!: అసెంబ్లీలో చ‌ంద్ర‌బాబు హెచ్చరిక

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ స‌భ్యులు అసెంబ్లీలో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నినాదాలు చేస్తుండ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. వాళ్లు రౌడీయిజం కావాల‌ని అనుకుంటున్నార‌ని, అయితే ఇక్క‌డ రౌడీయిజం జ‌ర‌గ‌డానికి వీలులేదని, ఈ విష‌యాన్ని వైసీపీ స‌భ్యులు గుర్తుపెట్టుకోవాల‌ని చ‌ంద్ర‌బాబు అన్నారు. తాను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన ‘కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాల‌ తీర్మానం’ను ఆమోదించాల‌ని కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి హోదాతో స‌మాన‌మైన సాయాన్ని అందిస్తుంద‌ని ఆయన  చెప్పారు.

ఈ రోజు తాము గ‌ర్వంగా చెబుతున్నామ‌ని, పోలవరం ప్రాజెక్టుని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తామ‌ని సీఎం అన్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ఖ‌ర్చు పెట్టింది 2,533 కోట్ల రూపాయ‌లు మాత్రమేన‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఆ త‌రువాత ప్ర‌భుత్వం ఖర్చుపెట్టింది 2,924 కోట్ల రూపాయ‌ల‌ని అన్నారు. అయితే, రెండున్న‌రేళ్ల‌లో తాము ఖ‌ర్చుపెట్టింది. రూ. 3500 కోట్లని స‌మాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఖ‌ర్చుపెట్టార‌ని చెప్పిన జ‌గ‌న్ వ్యాఖ్యల‌ని ఆయ‌న కొట్టిపారేశారు. చంద్ర‌బాబు మాట్లాడిన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాద తీర్మానానికి ఆమోదం తెలుపుతున్న‌ట్లు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు తెలిపారు. అనంతరం అసెంబ్లీనీ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

More Telugu News