: బెయిలు కావాలా?.. వంద తుమ్మచెట్లు నరకండి.. తమిళనాడు కోర్టు వినూత్న తీర్పు

తమిళనాడులోని ఓ జిల్లా కోర్టు పర్యావరణ అనుకూల తీర్పులు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. బెయిలు కోసం వచ్చే వారిని లక్షల రూపాయల పూచీకత్తు కోరకుండా వంద తుమ్మచెట్లు నరకాలని ఆదేశిస్తోంది. రాష్ట్రంలో తుమ్మచెట్లు విచ్చలవిడిగా పెరిగిపోయి పర్యావరణానికి చేటు చేస్తున్నాయి. వాటి కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా గాలిలో తేమ కూడా బాగా తగ్గిపోతోంది. ఈ విషయమై కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తుమ్మచెట్ల సమస్యపై స్పందించిన మద్రాస్, మధురై హైకోర్టు బెంచ్‌లు భూగర్భ జలాల పరిరక్షణ కోసం తుమ్మచెట్లను తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి.

ఈ క్రమంలో అరియలూరు కోర్టు వినూత్న తీర్పు చెప్పింది. బెయిల్‌ కోసం వచ్చేవారు 100 తుమ్మచెట్లు నరకాలని మేజిస్ట్రేట్ ఏకేఏ రెహమాన్ ఆదేశించారు. చెట్లను నరికినట్టుగా గ్రామ నిర్వాహక అధికారి నుంచి నివేదిక తీసుకుని కోర్టులో సమర్పించాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా ఉన్న ఈ తీర్పును పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు.

More Telugu News