: పవన్ కల్యాణ్ పరిస్థితి ఎలా వుందంటే.. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్!: వైఎస్ జగన్

తాను ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ బడ్జెట్ పై మాట్లాడేందుకే తప్పా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి చర్చించేందుకు కాదని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ పై విధంగా సమాధానమిచ్చారు. ప్రెస్ మీట్ ముగింపు సందర్భంగా ఓ విలేకరి ఈ విషయమై ప్రశ్నించగా, ‘నేను ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ బడ్జెట్ పై మాట్లాడేందుకు.. పవన్ కల్యాణ్ గురించి మనకు ఎందుకబ్బా?. ప్రజలకు సంబంధించిన కేటాయింపుల మీద చంద్రబాబు నాయుడు గారు చెయ్యాల్సింది ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? అనే దాని గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పవన్ కల్యాణే కాదు ఎవరు పోరాడేందుకు ముందుకు వచ్చినా ఆప్యాయంగా స్వాగతిస్తాం.. తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తాం. కాకపోతే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాత్రం.. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి పవన్ కల్యాణ్ మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’ అని జగన్ అన్నారు.  

More Telugu News