: నేను నాజీల నియంత లాంటి వాడిని!: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాను నాజీల నియంతలాంటి వాడినని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తాను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. పదేళ్ల క్రితం ఎన్నికలంటే ఊర్లలో ఎన్ని బాంబులు ఇచ్చారు? అని లెక్కలు రాసేవారని అన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా నేర్చుకున్నారని ఆయన చెప్పారు. బాంబులు పట్టుకోవడం మానేశారని ఆయన అన్నారు. తమ జీపులు కూడా ఎవరూ ఎక్కడం లేదని ఆయన అన్నారు. తన అనుచరుల గన్ లైసెన్సులు క్యాన్సిల్ అయిపోయాయని ఆయన చెప్పారు.

డబ్బులివ్వకుండా ఎలక్షన్ లో నిలబడాలన్న కోరిక ఉందని ఆయన చెప్పారు. తాను మరణించిన తరువాత వారం రోజులు తన గురించి మాట్లాడాలన్న కోరిక ఉందని ఆయన తెలిపారు. తాను కఠినంగా కనిపించినా సున్నిత మనస్కుడినని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పని విషయంలో నాజీల నియంత లాంటి వాడినని ఆయన చెప్పారు. తాను మొక్కలకి నీరు పోయించినప్పుడు అంతా డబ్బులు తినేస్తున్నాడన్నారని, ఇప్పుడు ఆ చెట్లను చూసి, ఎంత మంచి పని చేశావని పొగుడుతున్నారని ఆయన తెలిపారు. 

More Telugu News