: నేను ఏపీ నుంచే పోటీ చేస్తాను...చిరంజీవి మా పార్టీలోకి రారు: పవన్ కల్యాణ్

తాను ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీలో ఉంటామని అన్నారు. తమ పార్టీలోకి చిరంజీవి రారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. వారికి సక్రమంగా అందుతున్నప్పుడు ప్రభుత్వాలు విజయం సాధించినట్టని ఆయన అన్నారు. తమ పార్టీ అంతిమ లక్ష్యం ప్రజాసమస్యల పరిష్కారమని ఆయన అన్నారు. అధికారం తమ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

 ధనప్రవాహం లేని రాజకీయాలు కావాలని తనకు కూడా ఉందని, అయితే అది ఎంతవరకు సాధ్యమో ప్రయత్నించి చూస్తే కానీ తెలియదని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమ కారిణి ఇరోం షర్మిళ ఓటమి తనను బాధించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. గోపీచంద్ రాసిన కథ గుర్తుకొచ్చిందని ఆయన చెప్పారు. తనవరకు వస్తే విలువలు ఉండవన్నది ప్రజలు నిరూపించినట్టు అనిపించిందని పవన్ పేర్కొన్నారు. ఆమెకు ప్రజలు మద్దతు తెలపాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అనుభవం ఉన్నవారి అవసరం పార్టీకి ఉందని చెప్పిన పవన్ కల్యాణ్, అయితే వారిలో ప్రజాసమస్యలపై సరైన అవగాహన ఉండాలని, వాటి పరిష్కారానికి నిస్వార్థంగా పని చేసేతత్వం ఉండాలని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. 

More Telugu News