: హైదరాబాద్‌లోనూ భారీగా దర్శనమిచ్చిన ‘చిల్డ్రన్’ బ్యాంక్ ఆఫ్ ఇండియా దొంగ నోట్లు!

భార‌త క‌రెన్సీ నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రిత‌మైన నోట్లు ఇటీవ‌ల ఢిల్లీలోని ఏటీఎంల‌లో నుంచి వ‌చ్చి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోనూ అటువంటి నోట్లు క‌న‌ప‌డ్డాయి. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000, రూ.500 నోట్లను బ్యాంకుకు తీసుకొచ్చిన ఓ వ్య‌క్తి వాటిని డిపాజిట్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. బ్యాంకు అధికారులు విష‌యాన్ని గ‌మ‌నించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అత‌డిని అరెస్టు చేశారు.

యూసుఫ్ షేక్ అనే స్టేషనరీ షాప్ యజమాని ఏకంగా రూ.9.90 లక్షల విలువ గల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్న‌ నోట్లను తీసుకొచ్చాడ‌ని పోలీసులు తెలిపారు. తాను ఖాతా క‌లిగి ఉన్న‌ మల్కాజిగిరిలోని అలహాబాద్ బ్యాంకు క్యాషియర్‌కు ఆ నోట్ల‌నే ఇచ్చి త‌న పేరుమీద డిపాజిట్ చేయ‌మ‌ని చెప్పాడ‌ని, అయితే స‌ద‌రు బ్యాంకు మేనేజర్ త‌మ‌కు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడకు చేరుకుని యూసుఫ్‌ను అరెస్టు చేశామ‌ని చెప్పారు. ఆ నోటు అచ్చం ఒరిజిన‌ల్ నోటులాగే ఉంద‌ని, ఒక్క‌ చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌ప్ప అన్ని ఫీచ‌ర్లు ఒరిజిన‌ల్ నోట్ల లాగే ఉన్నాయ‌ని పోలీసులు అన్నారు.

More Telugu News