: మరుగుదొడ్డి కట్టించాక రా.. పెళ్లి చేసుకుందాం..!: ప్రియుడికి ప్రియురాలి షరతు

పెళ్లికి ముందు ప్రియురాలు విధించిన షరతు ఒకటి తాజాగా వెలుగులోకి రావడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని కొల్వాయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. గ్రామానికి చెందిన తిరుపతి ధర్మపురి మండలంలోని దోనూరుకు చెందిన సత్యవతి ఏడాదిగా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. అయితే ప్రియుడి ఇంట్లో మరుగుదొడ్డి లేదన్న విషయం తెలిసిన ప్రియురాలు.. అది కట్టించాకే మన పెళ్లి అంటూ తెగేసి చెప్పింది. అప్పటి వరకు పెళ్లి ఊసు ఎత్తవద్దని తెగేసి చెప్పింది. దీంతో తిరుపతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించి ఆ విషయాన్ని సత్యవతికి తెలియజేశాడు. దీంతో ఈనెల 6న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. సోమవారం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు గ్రామంలో మరుగుదొడ్ల లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తిరుపతి, సత్యవతి ప్రేమ పెళ్లి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో అందరూ సత్యవతిని అభినందించారు.

More Telugu News