: నీటిని ముట్టుకుంటే శిలలుగా మారుతున్న పక్షులు... విఠలాచార్య సినిమాల్లోని వింతలు అక్కడ ప్రత్యక్షం!

పురాణేతిహాసాల్లోనూ.. విఠలాచార్య సినిమాల్లోనూ సంభవించే ఘటనలు నిజజీవితంలో సంభవిస్తే అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. ఆఫ్రికాలోని టాంజానియాలో గల నాట్రాన్‌ సరస్సును సందర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ అక్కడ చోటుచేసుకుంటున్న ఘటనలు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సరస్సులో విఠలాచార్య సినిమాల్లోలా నీటిని తాకిన ప్రతి పక్షి శిలగా మారిపోవడాన్ని, ఆ క్రమంలో అది పడే నరకయాతనను తన ఫోటోల్లో బంధించాడా ఫోటోగ్రాఫర్ నిక్ బ్రాండిట్. ఈ ఫోటోలన్నీ తన ఫొటో పుస్తకం 'అక్రాస్‌ ది రవగేడ్‌ ల్యాండ్‌' లో పొందుపర్చాడు.

దీనిపై పలువురు శాస్త్రవేత్తలను సంప్రదించగా, సరస్సు ఇంత ప్రమాదకారిగా మారడానికి కారణం దానికి దగ్గర్లో ఉన్న అగ్నిపర్వతమేమోనన్న భావనను వారు వ్యక్తం చేశారు. అగ్నిపర్వత అంతర్భాగం ద్వారా సోడియం కార్బోనేట్‌, సోడియం బై కార్బోనేట్‌ (సోడియం సోడా) లు కలుస్తుంటాయని, వీటి ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయని చెప్పారు. దీని కారణంగా సరస్సు కూడా తన రంగు మార్చుకుని లేత గులాబీ వర్ణంలోకి మారిపోవడం విశేషం. కాగా, సరస్సులోని నీరు ఎప్పుడూ 140 డిగ్రీల వేడితో మరుగుతుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

More Telugu News