: టర్కీలో ప్రజాభిప్రాయ సేకరణ... యూరప్ దేశాలకు తలనొప్పి!

టర్కీ దేశంలో పార్లమెంట్ వ్యవస్థను రద్దు చేసి అధ్యక్ష వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ దేశాధ్యక్షుడు రిసైప్ ఎర్డగోన్ నూతన రెఫరెండమ్ ను జారీ చేశారు. దీనిపై ఏప్రిల్ 16న టర్కీలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. అయితే ఈ రెఫరెండం యూరప్ దేశాలకు తలనొప్పిగా మారింది. సుమారు 50 లక్షల మందికి పైగా టర్కీ ప్రజలు యూరప్ దేశాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేసేందుకు యూరప్ దేశాల్లో నివసించే టర్కీ ప్రజలందరూ అర్హులే. దీంతో టర్కీ ప్రభుత్వ అధికారులు వారి మద్దతు కూడగట్టుకునేందుకు యూరప్ దేశాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌ట్ల కొన్ని యూరోప్ దేశాలు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నాయి. తమ దేశాల్లో ఈ ర్యాలీలు చేపట్టవద్దని జ‌ర్మ‌నీ, నెద‌ర్లాండ్స్ దేశాలు తేల్చిచెప్పాయి. దీంతో ఆ దేశాల‌పై ఎర్డ‌గోన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌ర్మ‌నీ, నెద‌ర్లాండ్స్ దేశాల్లో ఇంకా నాజీ పోక‌డ‌లు ఉన్నాయ‌ని ఆయన ఆరోపించారు. ఎర్డ‌గోన్ వ్యాఖ్య‌ల‌ను యూరోప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. టర్కీలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు దిగ‌జారాయని డ‌చ్ ప్రధాని లార్స్ లాక్కీ రాస్‌ముసెన్ విమ‌ర్శించారు. అంతేకాదు, ట‌ర్కీ మంత్రితో నిర్వ‌హించాల్సిన స‌మావేశాన్ని కూడా ర‌ద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జ‌ర్మ‌నీ కూడా ట‌ర్కీ నిర్వ‌హిస్తున్న ప్ర‌ద‌ర్శ‌నల‌ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసింది. ట‌ర్కీ దేశ‌స్థులు జ‌ర్మ‌నీలో ప్ర‌చారం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ దేశ హోం మంత్రి అన్నారు. కేవ‌లం జ‌ర్మ‌నీలోనే సుమారు 15 ల‌క్ష‌ల మంది టుర్కులు ఉన్నారు. స్వీడెన్ కూడా ట‌ర్కీ చేపట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లను ర‌ద్దు చేసింది.

More Telugu News