: గోవా సీఎంగా మనోహర్ పారికర్.. రక్షణమంత్రి పదవికి రాజీనామా

గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.. గోవాలో 17 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైంది. బీజేపీ 13 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఎంజీపీ, జీఎఫ్‌పీ, ఎన్సీపీ, స్వతంత్రుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. పారికర్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలనే షరతుతోనే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు జీపీఎఫ్, ఎంజీపీలు తెలిపాయి.

దీంతో రక్షణమంత్రిగా ఉన్న పారికర్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాను కలిసిన పారికర్ 21 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. దీంతో ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆదివారం బాగా పొద్దుపోయాక గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. పారికర్ ప్రమాణ స్వీకారం చేశాక 15 రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.

More Telugu News