: టీడీపీతో మొదలు పెట్టి... టీడీపీతోనే ముగిసిన భూమా రాజకీయ ప్రస్థానం!

భూమా నాగిరెడ్డి తన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ ఆకస్మిక మరణానికి గురి కావడంతో జరిగిన ఉప ఎన్నికల్లో 1992లో భూమా నాగిరెడ్డి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. భూమా నాగిరెడ్డి 11, 12, 13వ లోక్ సభలకు వరుసగా నంధ్యాల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
1996లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి నాటి ప్రధాని పీవీ నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ భూమా నాగిరెడ్డిని ఎంపిక చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఈ ఎన్నికలో పీవీ చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే, పీవీ నరసింహారావు బెర్హంపూర్ లోక్ సభ స్థానం ప్రాతినిధ్యాన్ని ఉంచుకుని నంద్యాల స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూమానా గిరెడ్డి 4 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం


1984లో తొలిసారిగా ఆయన రుద్రవరం కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంపిక కాగా, అనంతరం 1986 నుంచి 1990 వరకు ఆళ్లగడ్డ మండల పరిషత్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. సినీ నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ అవతరణతో భూమా టీడీపీకి 2008 జూలై 4న రాజీనామా చేశారు. ఆగస్ట్ 20న ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం టికెట్ పై నంధ్యాల పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయన శ్రీమతి శోభానాగిరెడ్డి మాత్రం ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.

2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి పరిణామాలతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో భూమా నాగిరెడ్డి ఒకరు. అయినా తన మాట నెగ్గకపోవడంతో ఆయన ప్రజారాజ్యాన్ని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జగన్ తో విభేదాలు రావడతో తిరిగి తాను తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన టీడీపీలోకి గతేడాది ఫిబ్రవరిలో వచ్చి చేరారు. ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ తల్లి మరణం తర్వాత ఆళ్లగడ్డ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

వైద్యుడ్ని చేయాలనుకుంటే...


భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు ఆయన చిన్న కుమారుడు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్న బాలిరెడ్డి తన కుమారుడు భూమా నాగిరెడ్డిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డారు. చెన్నైలో పాఠశాల విద్య, అనంతరం వైద్య విద్య కోసం బెంగళూరు పంపించారు. కానీ, తండ్రి బాలిరెడ్డి హత్య తర్వాత భూమా వెనక్కి వచ్చి రాజకీయాల్లోకి చేరిపోయేలా చేసింది.

సోదరుడూ గుండెపోటుతోనే...

భూమా సోదరుడు శేఖర్ రెడ్డి సైతం 15 ఏళ్ల క్రితం ఇలానే ప్రాణాలు కోల్పోయారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా శేఖర్ రెడ్డి 1991 జూన్ 7న గుండెపోటు కారణంగా మృతి చెందారు. అదే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి టీపీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

భార్య మరణించిన మూడేళ్లకే...

తన సహధర్మచారిణి శోభానాగిరెడ్డి 2014 ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించిన మూడేళ్లకే భూమా నాగిరెడ్డి ఇలా హఠాన్మరణం చెందడం ఎంతో విచారకరం. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు  

More Telugu News