: ఈసారి వానలకు కటకటే.. ఎల్ నినో గండం పొంచి ఉందన్న వాతావరణ సంస్థలు

రెండేళ్ల క్రితం దేశంలోని రుతుపవనాలను దెబ్బతీసిన ఎల్‌నినో ఈ ఏడాది కూడా ప్రభావం చూపేందుకు సిద్ధమవుతోంది. ఈసారి వానలకు కటకట తప్పదని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఏడాది రెండో అర్ధభాగంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మోస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరికలు జారీ చేసింది. జూలై నుంచి దేశంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, ఇందుకు 50-55 శాతం అవకాశాలున్నాయని పేర్కొంది. భారత వాతావరణ శాఖతో పాటు ఆస్ట్రేలియా, యూరప్, జపాన్ తదితర దేశాల్లోని వాతావరణ  సంస్థలు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

పసిఫిక్ మహాసముద్రంపై సంభవించే ఎల్‌నినో ప్రభావం ప్రపంచంలోని పలు దేశాల రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అరకొర రుతుపవనాలతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు ఇది శరాఘాతమనే చెప్పవచ్చు. ఇప్పటికే 2015, 2009, 2004, 2002లో ఎల్‌నినో కారణంగా దేశంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరోమారు ఎల్‌నినో పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూలై-డిసెంబరు మధ్య ఎల్‌నినో ఏర్పడడానికి 50-55 శాతం అవకాశాలున్నాయని ఎన్ఓఏఏ అంచనా వేసింది. అయితే ఏప్రిల్-మే తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News