: అలసిన ధోనీ ఆమెకు ఆటోగ్రాఫ్ ఇవ్వనన్నాడు.. సెల్ఫీ దిగనన్నాడు!

సాధారణంగా తమ అభిమాన క్రికెటర్ల ఆటో గ్రాఫ్ తీసుకోవాలని, సెల్ఫీ దిగాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. క్రికెటర్లూ ..అందుకు ‘సరే’ అంటారు. అయితే, తమ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు, వారితో సెల్ఫీ దిగేందుకు క్రికెటర్లు నిరాకరించే సందర్భాలు లేకపోలేదు! అటువంటి సంఘటన ఒకటి ఓ మహిళా అభిమానికి ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీ ముగించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, కోల్ కతా నుంచి జార్ఖండ్ చేరుకున్నాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం బయట తన వాహనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ముప్పై ఐదేళ్ల ఓ మహిళాభిమాని ధోనీతో సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నించింది.

అయితే, అప్పటికే బాగా అలసిపోయి ఉన్న ధోనీ, అందుకు నిరాకరించాడు. తన వాహనం రావడంతో అందులో ఎక్కాడు. అయితే, పట్టువదలని ఆ అభిమాని, ధోని వాహనానికి అడ్డు పడింది. దీంతో, వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది, ఆమెను పక్కకు వెళ్లమని చెప్పారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి, ఆ మహిళకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళ హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోవడంతో, దానిని తీసుకునేందుకు పక్కకు వెళ్లడంతో ధోనీ కారు దూసుకుపోయింది. అయితే, ఆ హ్యాండ్ బ్యాగుపై నుంచి వాహనం వెళ్లినట్టు గుర్తించిన ధోనీ, తన కారు ఆపి, డోర్ తీసి వెనక్కి చూశాడు. ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకున్న తర్వాత  ధోనీ వెళ్లిపోయాడు. 

More Telugu News