: మీ నాన్న సీఎం అయినప్పుడు నీ ఆస్తి ఎంత? మీ నాన్న చనిపోయేనాటికి నీ ఆస్తి ఎంత?: జగన్ పై దేవినేని నెహ్రూ ఫైర్

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత దేవినేని నెహ్రూ నిప్పులు చెరిగారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు ముందు నుంచి తెలుసని చెప్పిన ఆయన... మీ నాన్న సీఎం అయినప్పుడు నీ ఆస్తి ఎంత? ఆయన చనిపోయే నాటికి నీ ఆస్తి ఎంత? అంటూ జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. దాదాపు రూ. 1500 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని... వీటిలో ఏ ఒక్క కోటి రూపాయలైనా సక్రమమైన పద్ధతిలోనే సంపాదించుకున్నానని నీవు నిరూపించగలవా? అంటూ ధ్వజమెత్తారు. ఏ ఒక్క రూపాయి గురించైనా ఏ కోర్టులోనైనా నీవు కౌంటర్ వేయగలిగావా? అని ప్రశ్నించారు.

అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి జగన్ వైఖరి సరిగా లేదని... ఏదైనా మంచి పని చేసేటప్పుడు దాన్ని పాడు చేయాలని అనుకోకూడదని జగన్ కు నెహ్రూ సూచించారు. ఇలాంటి వైఖరి నీ రాజకీయ జీవితానికి గొడ్డలిపెట్టు అవుతుందని అన్నారు. జగన్ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యాడని... ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. అధికారులతో సైతం ఎలా మాట్లాడాలో జగన్ కు తెలియడం లేదని విమర్శించారు.

More Telugu News