: వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు!

వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నకిలీ డాక్యుమెంట్ల కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాలలో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ కాకాని కొన్ని డాక్యుమెంట్లను చూపారు. అయితే, ఈ డాక్యుమెంట్లన్నీ ఫేక్ అని తేలడంతో సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం, ఈ కేసును కొట్టి వేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాని. అయితే, ఈ పిటిషన్ ను కొట్టి వేసిన హైకోర్టు... పోలీసు విచారణకు సహకరించాలంటూ ఆయనను ఆదేశించింది. దీంతో, కాకాని జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన జిల్లా కోర్టు పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. దీంతో, బెయిల్ కోసం కాకాని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు, కాకానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News