: మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ప్రసూతి సెలవులు ఇక 26 వారాలు

మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు 12 వారాలు మాత్రమే ఉన్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. బెనిఫిట్(సవరణ) బిల్-2016 బిల్లుకు గత శీతాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు లోక్‌సభ కూడా ఆమోద ముద్ర వేయడంతో దేశ వ్యాప్తంగా 18 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

ప్రసూతి సెలవుల విషయంలో దేశం చరిత్ర సృష్టించిందని మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ అన్నారు. దేశానికి మరింత ఆరోగ్యవంతమైన పౌరులను అందించే అవకాశం తల్లులకు ఏర్పిడందన్నారు. బెనిఫిట్ (సవరణ) బిల్-2016 నాలుగు గంటలపాటు చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు పేటర్నిటీ (పితృత్వ) సెలవులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం.

బెనిఫిట్(సవరణ) బిల్-2016 ప్రకారం.. 26 వారాల సెలవు మొదటి రెండు బిడ్డలకు వర్తిస్తుంది. మూడు నెలల కంటే తక్కువ ఉన్న పిల్లలను దత్తత తీసుకుంటే 12 వారాల సెలవు ఇస్తారు. 50 మందికి మించి మహిళా ఉద్యోగులున్న సంస్థలు, కార్యాలయాల్లో శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాన్ని తల్లి  నాలుగు సార్లు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును కూడా తల్లులకు కల్పించవచ్చు.

More Telugu News