: గడుసు సమాధానంతో సభికులందర్నీ నవ్వించిన అశ్విన్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాటల చాతుర్యంతో సభికులను ఆకట్టుకున్నాడు. దిలీప్ సర్దేశాయ్ అవార్డు-2017 ప్రదానోత్సవాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువులు ఆటగాళ్లు, ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ బౌలర్ గా అవార్డు గెలుచుకున్న అశ్విన్ కు అవార్డు అందజేసిన అనంతరం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన భారత జట్టు మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ఓ ప్రశ్న సంధించారు. చంద్రశేఖర్, ఎర్రపల్లి ప్రసన్న, అశ్విన్ వంటి దిగ్గజ స్పిన్నర్లను సృష్టించిన కావేరీ నదీ జలాల్లో ఏముంది? అని అడిగారు.

దీనికి అశ్విన్‌ గడుసుగా సమాధానమిస్తూ....రాజకీయాలను ఆటల్లోకి తీసుకురావాలన్నది తన ఉద్దేశం కాదని చెబుతూ, ఈమధ్య కావేరీ జలాలను కర్ణాటక వాళ్లు తమిళనాడులోకి వదిలారని అన్నాడు. దీంతో అశ్విన్ మాటల్లోని శ్లేషను గుర్తించిన సభికులు హాయిగా నవ్వేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం సుదీర్ఘకాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే కర్ణాటక నుంచి తమిళనాడుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నీరు వదిలారు. దీనిని సూచిస్తూ.... కన్నడిగులైన చంద్రశేఖర్, ప్రసన్న తాగిన నీటిని ఈ మధ్య విడవడంతో తమిళనాడుకు చెందిన తనలో కూడా వారి ప్రతిభే కనిపిస్తుందన్న వ్యాఖ్య అశ్విన్ చేయడంతో అంతా నవ్వేశారు. 

More Telugu News