: ‘హిందూ’ భక్తి గీతాన్ని ఆలపించిన ముస్లిం యువతికి బెదిరింపులు!

ఒక టెలివిజన్ ఛానెల్ లో హిందువుల ముస్లిం గీతాన్ని ఆలపించిన కర్ణాటకకు చెందిన ముస్లిం యువతి సుహానాకి బెదిరింపులు వస్తున్నాయి. మంగళూరు ముస్లిం గ్రూప్ పేరుతో ‘ఫేస్ బుక్’ పేజీలో ఆమెను బెదిరిస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘జీ కన్నడ’లో నిర్వహించిన ‘సరిగమప’ రియాల్టీ షోలో హిందూ మతానికి చెందిన ఓ భక్తి గీతాన్ని సుహానా ఆలపించింది. దీనిని ఇస్లాం ఛాందసవాదులు తప్పుబడుతున్నారు. ఈ గీతాన్ని ఎంపిక చేసుకోవడం, అదీ మగవాళ్ల ముందు పాడటం, పైగా బురఖా ధరించకపోవడం వంటి క్షమించరాని నేరాలకు ఆమె పాల్పడిందని ఛాందసవాదులు ఆరోపించారు.

ఇదిలా ఉంటే, సుహానాకు మద్దతుగా ఆ రియాల్టీ షో న్యాయ నిర్ణేతలు నిలిచారు. సుహానాకు బెదిరింపులు వచ్చిన వ్యవహారం సామాజిక మాధ్యమాలకు చేరింది. పలువురు నెటిజన్లు సుహానాకు మద్దతు ప్రకటిస్తూ తమ పోస్ట్ లు చేశారు. అయితే, సుహానాకు బెదిరింపులు రావడంపై కర్ణాటక మంత్రి యూటీ ఖదేర్ స్పందిస్తూ, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం ఇప్పటికే చర్యలకు సిద్ధమయ్యామని చెప్పారు.

More Telugu News