: ఐఎస్ఐఎస్ నా తమ్ముడికి రెండు నెలల పాటు బ్రెయిన్ వాష్ చేసింది!: హతమైన ఉగ్రవాది సైఫుల్లా సోదరుడు

కొంతకాలం క్రితం వరకూ అందరిలానే మంచి వాడుగా ఉన్న తన తమ్ముడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రెండు నెలల పాటు బ్రెయిన్ వాష్ చేసి, దేశానికి వ్యతిరేకంగా మార్చారని, లక్నోలో భద్రతాదళాల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది సైఫుల్లా సోదరుడు ఖలీద్ మొహమ్మద్ వ్యాఖ్యానించారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఎన్ కౌంటర్ లో సైఫుల్లాకు లొంగిపోయేందుకు అనుమతిస్తూ, ఖలీద్ తో సైతం ఫోన్లో మాట్లాడించిన సంగతి తెలిసిందే.

డిగ్రీ విద్యను రెండో సంవత్సరం ఆపేసిన సైఫుల్లా, రెండు నెలల క్రితం సౌదీ వీసా ప్రయత్నాల కోసం ముంబై వెళుతున్నట్టు తమకు చెప్పాడని, ముంబైలోనే అతన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మార్చారని, వారెవరో గుర్తించి, పోలీసులు కఠిన శిక్షలు విధించేలా చూడాలని ఖలీద్ కోరాడు. తాను దాదాపు గంట సేపు సైఫుల్లాను లొంగిపోవాలని కోరుతూనే ఉన్నానని, తనకు తుపాకుల చప్పుళ్లు తప్ప మరేమీ వినిపించలేదని చెప్పాడు. అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడని, స్థానిక మదారసాలకు ప్రార్థనల నిమిత్తం వెళ్లేవాడని, ఇటువంటి దుశ్చర్యకు దిగుతాడని కలలో కూడా ఊహింలేదని అతని ఇరుగు, పొరుగు ప్రజలు వ్యాఖ్యానించారు.

More Telugu News