: వచ్చే నెలలోనే ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో పెరిగిన ఉత్కంఠ!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వచ్చే నెలలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగియడంతో ఏప్రిల్ మొదటి, లేదంటే రెండో వారంలో విస్తరణ ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు. అలాగే మంత్రివర్గంలోకి లోకేశ్‌ను తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఏప్రిల్‌లో టీడీపీ జిల్లా కమిటీల ఎన్నికలు, మే నెలలో మహానాడు సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రస్థాయి మహానాడు సమావేశాలు జరగనున్నాయి. దీంతో మహానాడు ముగిసే లోపే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కూడా పూర్తిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక కారణంతో సీఎంను కలుస్తూ ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ప్రస్తుతం శాసనమండలి నుంచి యనమల రామకృష్ణుడు, నారాయణ మంత్రులుగా ఉన్నారు. లోకేశ్‌ను కూడా మండలి నుంచే మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరిని మించి శాసనమండలి నుంచి తీసుకోబోరనే ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రివర్గంలో శాసనసభ నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News