: విభిన్న పాత్రలు పోషించినప్పుడే సంతృప్తి: ఆలియా భట్‌

విభిన్న పాత్రల్లో నటించినప్పుడే నటిగా సంతృప్తి చెందుతానని అంటోంది బాలీవుడ్ నటి ఆలియాభట్. గత సంవత్సరం ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ’ఉడ్తా పంజాబ్’ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డు సైతం ఆమె అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో కాకుండా యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీ, బయోపిక్ వంటి విభిన్న పాత్రల్లో నటించాలని ఉందని చెప్పింది.

తాను అవార్డుల కోసం నటించడం లేదని... ఒకవేళ తనకు జాతీయ అవార్డు వస్తే మాత్రం దానిని అందుకోవడం గౌరవంగా భావిస్తా అని తెలిపింది. 'ఆ అవార్డులు మన కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావించి... నేను పడ్డ కష్టాన్ని గుర్తించారని సంతోషిస్తా. ఒకవేళ అవార్డులు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. కెరీర్ లో నేను ఏ స్థాయిలో ఉన్నానో ప్రేక్షకులే నిర్ణయిస్తారు. నటనకు వయస్సుతో సంబంధం లేదు, నేను సినిమాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలే అవుతోంది. మంచి పాత్రలు లభిస్తే 40, 50 సంవత్సరాలు వచ్చే వరకు సినిమాల్లో నటిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది ఆలియాభట్.

More Telugu News