: కట్టప్ప తండ్రి పరాక్రమమిది... 'ది రైజ్ ఆఫ్ శివగామి' ట్రయల్ చూపిన రాజమౌళి

'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రం విడుదల దగ్గర పడుతున్న కొద్దీ, ఆ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు రాజమౌళి. మాహిష్మతి సామ్రాజ్యానికి ముందు జరిగిన కథగా ఆనంద్ నీలకంఠన్ రచించిన 'ది రైజ్ ఆఫ్ శివగామి' పుస్తకాన్ని ప్రమోట్ చేస్తూ, అందులో కట్టప్ప చాప్టర్ కు సంబంధించిన మూడు పేజీలను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు రాజమౌళి. ఇందులో కట్టప్ప తండ్రి చేస్తున్న యుద్ధ సన్నాహాలు, తన కుమారుడికి ఇస్తున్న ఆదేశాలు, ఆపై సైన్యం సమాయత్తానికి సంబంధించిన అంశాలు పొందుపరచబడి వున్నాయి. కట్టప్ప తండ్రి ఎలా ఉంటాడన్న అంశాలున్నాయి.

ఈ పుస్తకం ఈ 15వ తేదీన మార్కెట్లోకి రానుండగా, కిండెల్ ఎడిషన్ ధర రూ. 175గా, పేపర్ బ్యాక్ ధర రూ. 220గా నిర్ణయించారు. మాహిష్మతి సామ్రాజ్య స్థాపన, శివగామి ఎదిగిన తీరు, ఆమెకు కట్టప్ప ఎలా సహకరించాడు, ఆమె తన శత్రువులను ఎలా తుదముట్టించిందన్న అంశాలతో, బాహుబలి చిత్ర కథకు ముందు జరిగిన కథగా ఈ పుస్తకాన్ని రాజమౌళి అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇక పుస్తకంలోని తదుపరి పేజీలను దశలవారీగా విడుదల చేస్తానని రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.


More Telugu News