: శరీరాన్ని చల్లగా ఉంచే 'ఏసీ జాకెట్' వచ్చేసింది... ఆవిష్కరించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే 20 డిగ్రీల వరకూ శరీరాన్ని చల్లగా ఉంచే ఏసీ జాకెట్ మార్కెట్లోకి వచ్చేసింది. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వీటిని ఆవిష్కరించారు. ఖన్వా కాటన్ కు, అత్యాధునిక సాంకేతికతను మేళవించి వీటిని తయారు చేసినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంచే వీటిల్లో రెండు బటన్ లు ఉంటాయి. ధరించిన వారు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఈ జాకెట్ లో బ్యాటరీతో నడిచే కూల్, హాట్ ఎయిర్ ఫ్యాన్స్ ఉంటాయి. ఓ ఎంఐటీ గ్రాడ్యుయేట్ 'క్లయిమెట్ గేర్' సాంకేతికతను అభివృద్ధి చేయగా, దీని సాయంతో ఈ జాకెట్ ను తయారు చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జాకెట్ తయారీకి సహకరించింది. అతి త్వరలో ఈ జాకెట్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని గిరిరాజ్ వెల్లడించారు. కాగా, ఫుల్ స్లీవ్ జాకెట్ రూ. 25 వేలుగా ఉండగా, హాఫ్ జాకెట్ రూ. 18 వేల వరకూ ఉంటుందని సమాచారం.

More Telugu News