: ఆసీస్ బ్యాట్స్ మన్ కు కళ్లెం వేస్తున్న టీమిండియా బౌలర్లు

టీమిండియా బౌలర్లు సరైన సమయంలో జూలు విదిల్చారు. తొలి టెస్టు ఓటమి భారంతో తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో రాణించారు. ఆట గడిచే కొద్దీ బ్యాటింగ్ చేయడం క్లిష్టతరంగా మారుతున్న బెంగళూరు పిచ్ పై 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టును టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. అయితే 9వ డౌన్ వరకు అంతో ఇంతో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆసీస్ కు అవకాశం ఇవ్వకుండా కోహ్లీ ఒక ఎండ్ లో స్పిన్, మరో ఎండ్ నుంచి పేస్ బౌలింగ్ వేయిస్తూ బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. టాప్ ఆర్డర్ ను అశ్విన్, ఉమేష్ యాదవ్ కలిసికట్టుగా కుప్పకూల్చారు.

 దీంతో సులభంగా విజయం సాధిస్తుందని భావించి ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ టీమిండియా బౌలర్ల బంతులకు విలవిల్లాడారు. దీంతో వార్నర్ (17), రెన్ షా  (5), షాన్ మార్ష్ (9), స్మిత్ (28), మిచెల్ మార్ష్ (13), మాధ్యూ వేడ్ (0), మిచెల్ స్టార్క్ (1) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. మూడవ డౌన్ లో దిగిన హ్యాండ్స్ కోంబ్ ధాటిగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా ఒకీఫ్ (0) క్రీజులో ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 32  ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, ఉమేష్ యాదవ్ రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు.  

More Telugu News