: ఇక భారత క్రికెట్ కొత్త స్పాన్సరర్ గా చైనా సంస్థ

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పొ మొబైల్స్, భారత క్రికెట్ టీముకు కొత్త స్పాన్సరర్ గా వచ్చి చేరింది. స్పాన్సర్ షిప్ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లను పిలువగా, ఆకర్షణీయమైన ధరను కోట్ చేసిన ఒప్పో ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల పాటు ఒప్పో కాంట్రాక్టు అమలులో ఉంటుందని, భారత జట్టు ఆటగాళ్లు ధరించే జర్సీపై ఆ సంస్థ లోగో కనిపిస్తుందని బీసీసీఐ వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం భారత జట్టు స్పాన్సరర్ గా ఉన్న స్టార్ ఇండియా కాంట్రాక్టు ఈ నెలాఖరుతో ముగియనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత జట్టు మొత్తం 259 మ్యాచ్ లను ఆడనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2019 వరల్డ్ కప్, 2020 టీ-20 వరల్డ్ కప్, 2021 చాంపియన్స్ ట్రోఫీ తదితర 21కి పైగా టోర్నమెంట్లలో భారత్ పాల్గొంటుంది. కాగా, ఒక్కో మ్యాచ్ కి స్పాన్సరర్ గా ఉన్నందుకు స్టార్ ఇండియా రూ. 1.92 కోట్లను చెల్లించగా, ఈ దఫా కాంట్రాక్టుకు కనీస ధరను రూ. 2.2 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. అయితే, ఒప్పో ఏ ధరను కోట్ చేసి కాంట్రాక్టును దక్కించుకుందన్న విషయం తెలియాల్సివుంది.

More Telugu News