: విమానాల నుంచి అంతరిక్ష లక్ష్యాలను పేల్చే రాకెట్లను తయారుచేస్తున్న చైనా

భవిష్యత్తులో యుద్ధం చేయాల్సి వస్తే, శత్రు దేశాల శాటిలైట్లను దెబ్బతీసేలా కీలక ఆయుధాలను తయారు చేసుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేస్తోంది. విమానం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించగల అత్యాధునిక కొత్త తరం క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్టు చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ అధినేత లీ తాంగ్యూ వెల్లడించారు. పనిచేయని శాటిలైట్లను నాశనం చేసేందుకే వీటిని తయారు చేసుకుంటున్నామని, ఏవైనా అనుకోని ఉత్పాతాలు ఎదురైన వేళ, ప్రస్తుతం ఉన్న శాటిలైట్లకు అనుబంధంగా చిన్న శాటిలైట్లను పంపేందుకు ఈ క్షిపణులు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు.

కనీసం 100 కిలోల బరువైన లోడ్ తో, ఇవి లోయర్ ఆర్బిట్ కు చేరుతాయని అన్నారు. జెట్ విమానాల ద్వారా వీటిని ప్రయోగించవచ్చని, విమానం నుంచి విడుదలైన తరువాత, వీటి ఇంధనం మండటం ఆరంభమవుతుందని లీ వెల్లడించినట్టు అధికార పత్రిక 'చైనా డైలీ' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ సంవత్సరం జూలై నుంచి వాయుసేనకు వీటి డెలివరీ ప్రారంభమవుతుందని అన్నారు. కాగా, 1990 దశకంలోనే అమెరికా ఈ తరహా రాకెట్లను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. వర్జిన్ గెలాక్టిక్, జనరేషన్ ఆర్బిట్ లాంచ్ సర్వీసెస్ వంటివి వీటిని ఇప్పుడు మరింతగా ఆధునికీకరిస్తున్నాయని చైనా పత్రిక వెల్లడించింది.

More Telugu News