: ముస్లిం దేశాల నుంచి వలసలపై మళ్లీ అమెరికా నిషేధం.. ఊపిరి పీల్చుకున్న ఇరాక్

మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది సాధించారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసి ఇంటాబయట విమర్శలు కొనితెచ్చుకున్నారు. కోర్టులతోనూ మొట్టికాయలు వేయించుకున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని ట్రంప్ పాత ఆదేశాలకు కొద్దిపాటి మార్పులు చేసి కొత్తగా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధం విధించగా ఈసారి ఆ జాబితా నుంచి ఇరాక్‌ను మినహాయించి సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్ దేశాలకు పరిమితం చేశారు. తాజా ఆదేశం ప్రకారం ఈ ఆరు దేశాల నుంచి మూడు నెలలపాటు వలసలపై నిషేధం ఉంటుంది. అలాగే శరణార్థులను కూడా 120 రోజులపాటు దేశంలోకి అనుమతించరు. అయితే అనుమతి పొందిన వారికి మాత్రం కొన్ని షరతులతో మినహాయింపు ఉంటుంది. కాగా వలసల నిషేధ దేశం నుంచి తమను మినహాయించడంపై ఇరాక్ హర్షం వ్యక్తం చేసింది. ట్రంప్ తాజా ఆదేశం ఈనెల 16 నుంచి అమల్లోకి వస్తుంది. వెంటనే అమలు చేస్తే గతంలోలా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉండడంతో పది రోజుల సమయం ఇచ్చారు.

More Telugu News