: సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందంటే... చంద్రబాబుకు మూడినట్టే!: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంపై... సుప్రీంలో పిటిషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ కేసులో చంద్రబాబుకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసిందంటే... చంద్రబాబుకు మూడినట్టేనని చెప్పారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా వీడియోలకు దొరికిపోయారంటూ ఆళ్ల ఎద్దేవా చేశారు.

'మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ' అనే గొంతు ఆయనదే అనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం మీద 10 ఏళ్ల పాటు హక్కులు ఉన్నప్పటికీ... హైదరాబాదును చంద్రబాబు వదులుకున్నారని విమర్శించారు. కేసుల భయంతో హైదరాబాద్ నుంచి చంద్రబాబు పరారయ్యారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు.

More Telugu News