: నేటికి ఓకే, మరి రేపు రోజా పరిస్థితి ఏంటి?

గత కొంతకాలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా సాగుతున్న వైకాపా శాసనసభ్యురాలు రోజా వ్యవహారంపై చిక్కుముడులు ఇంకా వీడలేదు. నేడు నవ్యాంధ్రలో నూతన అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా, గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, తనను ఎవరూ అడ్డుకోకపోవడంతో రోజా సులువుగానే సభలోకి వచ్చి గవర్నర్ ప్రసంగం ముగిసేంతవరకూ వైకాపాకు కేటాయించిన సీట్ల వరుసలో వెనక కూర్చుని ఉన్నారు. ఇక రేపు రోజా పరిస్థితి ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత చేసిన ఆరోపణలపై రోజాకు ఎటువంటి శిక్షను విధించాలన్న విషయం ఇంకా తేల్చలేదు. మరోవైపు తాను అసెంబ్లీకి వచ్చి క్షమాపణలు చెబుతానని రోజా ఇప్పటికే స్పీకర్ కోడెలకు లేఖ రాశారు. ఆమె క్షమాపణలు చెప్పిన పక్షంలో, చర్యలు తీసుకునే అధికారాన్ని సభకు వదిలిపెట్టాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు ఆమెను సభకు అనుమతిస్తారా? అనుమతించిన పక్షంలో ఆమె క్షమాపణ చెబితే, ఆపై సభలో ఉండేందుకు అంగీకరిస్తారా? అన్నది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

More Telugu News