: ‘ముఖ్యమంత్రి’ అనే మాట అనగానే నాడు వైఎస్ అలా స్పందించారు!: పొన్నాల లక్ష్మయ్య

కొన్నేళ్ల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి శ్రీశైలం వెళ్లిన సందర్భంలో జరిగిన ఒక సంఘటన గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేసుకున్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘1985 లో అనుకుంటా.. డేట్ గుర్తులేదు. ఒక రోజున రాజశేఖరెడ్డిగారు నాకు ఫోన్ చేశారు. ‘శ్రీశైలం వెళుతున్నాం. మీరు వస్తారా?’ అని అడిగారు. అందరం కలిసి కుటుంబాలతో కలిసి వెళ్లాం. రెండున్నర, మూడు గంటల సేపు పూజలు చేశాం. ఆ తర్వాత బయటకు వచ్చాం. రాజశేఖరరెడ్డిగారు, కేవీపీ గారు, నేను, నడిచి వెళుతున్నాము.

అంతలో లుంగీ, బనియన్ ధరించి దానిపై ఓ వస్త్రం కప్పుకున్న ఒక అతను వచ్చి రాజశేఖరెడ్డిగారి కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే, అతన్ని ఆయన పైకి లేపారు. ‘మీరు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి సార్’ అని అతను అనగానే.. రాజశేఖరెడ్డి గారు నవ్వారు. ఒక పది అడుగులు వేశాం.. ‘ఈ అవకాశం మనకు వస్తే.. ఈ రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకురాగలుగుతామా? అని రాజశేఖరెడ్డిగారు అన్నారు. మేము షాక్ తిన్నాం. ముఖ్యమంత్రి మాట రాగానే ఆయన ఈ మాట అంటున్నారంటే.. రాయలసీమలో నీళ్ల కష్టాలే కారణమని అనుకున్నాను. అంతే, పందొమ్మిది సంవత్సరాల తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి కాగానే ‘జలయఙ్ఞం’ కార్యక్రమాలు, ప్రాజెక్టులు ప్రారంభించారు’ అంటూ పొన్నాల చెప్పుకొచ్చారు. 

More Telugu News