: జేసీది నోరా? తాటిమట్టా?: విరుచుకుపడిన సీపీఐ నేత రామకృష్ణ

రాష్ట్రంలో జేసీ బ్రదర్స్ ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని ఏపీ సీపీఐ నేత రామకృష్ణ నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారం అండగా, వారిద్దరూ రెచ్చిపోతున్నారని విమర్శించారు. జేసీ, తన నోటికి ఎంత మాటొస్తే, అంతమాట అంటున్నారని, అది నోరా? లేక తాటిమట్టా? అని విమర్శించారు. బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందితే, పశ్చాత్తాపపడాల్సింది పోయి, విమర్శలు చేయడం దారుణమని, అందుకు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు సిగ్గు పడాలని అన్నారు.

వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలుకుతూ, రౌడీల్లా వ్యవహరిస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు వెంటనే ఆ సోదరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే తీవ్ర ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోకుంటే, జరుగుతున్న దారుణాల వెనుక చంద్రబాబు హస్తం కూడా ఉంటుందని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

More Telugu News