: దెయ్యం ముసుగులో మైనర్ల ప్రేమలీల... అనంతపురంలో తీవ్ర చర్చ!

అది అనంతపురం శివార్లలో ఉన్న ఓ ప్రముఖ విద్యా సంస్థ. అక్కడ హైస్కూల్, ఇంటర్ కాలేజీలుండగా, వాటికి అనుబంధంగా ఓ హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్ లో దెయ్యాలు తిరుగుతున్నాయన్నది చాలా రోజులుగా వినిపిస్తున్న వదంతి. 9వ తరగతి బాలికతో ప్రేమాయణం ప్రారంభించిన ఇంటర్ విద్యార్థి, ఆమెను ఏకాంతంగా కలుసుకునేందుకు ఈ ప్రచారం సాగించాడు. వేర్వేరు హాస్టల్స్ లో ఉంటున్న వారు, రాత్రిపూట పాఠశాల పైకప్పు ఎక్కి ప్రేమలీలలు సాగించేవారు.

దీన్ని చూసిన కొందరు విద్యార్థులు ప్రశ్నించగా, రాత్రుళ్లు తిరిగే దెయ్యాలను కనుగొనాలని వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. ఇక గత వారంలో వీరిద్దరినీ గమనించిన కాలేజీ సిబ్బంది, వారిని చితకబాది, రాత్రికి రాత్రే టీసీ ఇచ్చి పంపగా, విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విషయమై, పాఠశాల కరస్పాండెంట్ స్పందిస్తూ, 9వ తరగతి అమ్మాయికి, ఇంటర్ అబ్బాయికీ మధ్య ప్రేమాయణం సాగుతున్న విషయం తమకు తెలిసిందని, ఇతర విద్యార్థులు ఇలా చేయకుండా ఉండాలనే కఠినంగా వ్యవహరించామని తెలిపారు. కాగా, వేలకు వేలు పోసి హాస్టల్ లో ఉంచి తమ బిడ్డలను చదివిస్తుంటే, వారిపై సరైన నిఘా, నియంత్రణను యాజమాన్యాలు ఉంచడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

More Telugu News