: దాసరి డిశ్చార్జ్ కు మరో రెండు వారాలు పడుతుంది: కిమ్స్ ఎండీ
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ బి.భాస్కరరావు తెలిపారు. హైదరాబాదులో దాసరి ఆరోగ్యంపై ఆయన మాట్లాడుతూ, శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ 35 రోజుల క్రితం దాసరి నారాయణరావు తమ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఈ సమయంలో ఆయన ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ ను క్లీన్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోపాటు, ఆయన కిడ్నీల పనితీరు మందగించిందని, దీంతో ఆయనను నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి డయాలసిస్ నిర్వహించి చికిత్స అందించామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఆయన మూత్రపిండాల పని తీరు కూడా మెరుగుపడిందని ఆయన తెలిపారు. మరో రెండు వారాలు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.