: మీ జాతకాలన్నీ నా దగ్గరున్నాయి... తోకలు కత్తిరిస్తా!: విజయనగరం టీడీపీ నేతలకు బాబు వార్నింగ్

విజయనగరం జిల్లా నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో జిల్లా నేతలు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్‌ ఛార్జ్‌ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, నారాయణస్వామి నాయుడు, మీసాల గీత, చిరంజీవులుతో సమావేశమైన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'జిల్లాలోని లుకలుకలు నాకు తెలియవనుకుంటున్నారా?' అని బాబు ప్రశ్నించారు.

తప్పులు సరిదిద్దుకుంటారని ఓపికగా చూస్తున్నానని, విభేదాలు మరచి పని చేయాలని ఆయన సూచించారు. 'సాలూరు ఎమ్మెల్యే ఉండగా, అక్కడ మీకేం పని?' అంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ను ప్రశ్నించారు. మీడియాలో వచ్చిన కథనాలు చూపించి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకేమీ తెలియదనుకుంటే తోకలు కత్తిరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విభేదాలు మరచి సమన్వయంతో పని చేయాలని, పార్టీని నాశనం చేయాలని చూస్తే మాత్రం తాను చూస్తూ ఊరుకోనని బాబు తెలిపారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని ఆయన సూచించారు. 

More Telugu News