: సోషల్ మీడియా పిచ్చితో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

సోషల్ మీడియాలో వీడియో పెట్టి లైకులు కొట్టించుకోవాలన్న పిచ్చితో యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. సింగపూర్ లో చోటుచేసుకున్న తాజా ఘటన సోషల్ మీడియాపై యువత మోజును చాటుతోంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఆస్ట్రేలియాలో చదువుకుని, సింగపూర్‌లో తన నేషనల్ సర్వీస్ పూర్తి చేసేందుకు వచ్చిన జొనాథన్ చో (17) అనే యువకుడు తన స్నేహితురాలితో కలిసి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అక్కడ నాలుగవ అంతస్తుకు చేరుకున్న వారిద్దరూ కింద ఫ్లోర్ లో ఉన్న సన్ షేడ్ ను చూసి, దానిపై దూకాలని భావించారు.

సురక్షితంగా దూకేద్దామని భావించిన జొనాథన్ తాను దూకడాన్ని వీడియో తీయాలని స్నేహితురాలిని కోరాడు. స్నేహితురాలు చూస్తుండగా కిందికి దూకాడు. అయితే ఆ సన్ షేడ్ ప్లాస్టిక్ తో చేసినది కావడంతో అది అతని బరువును కాయలేక,  కిందపడింది. దీంతో కిందపడ్డ జొనాథన్ ప్రాణాలు కోల్పోయాడు. అతనిని రక్షించే ప్రయత్నంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. 

More Telugu News