: ఆ విషయాన్ని కొంత మంది వైద్యులే నాకు చెప్పారు: జయలలిత మృతిపై పన్నీరు సెల్వం

జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మరోసారి పలు ఆరోపణలు గుప్పించారు. ఈ సారి తనకు ఆసుపత్రి వైద్యులే కొన్ని విషయాలు చెప్పారని ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాలను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు, ఆమె కుటుంబ సభ్యులకు తాను పూర్తి వ్యతిరేకంగా ఉన్నానని నిర్ధారించుకున్న తరువాతే తనకు వారు విలువైన సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. అమ్మకు విదేశాల్లో వైద్యం అందిద్దామని ప్రతిపాదిస్తే... శశికళ తీవ్రంగా వ్యతిరేకించిందని వారు తెలిపారని పన్నీరు సెల్వం తెలిపారు. శశికళ కారణంగానే జయలలిత మృతి చెందారని ఆయన స్పష్టం చేశారు.

శశికళ పదేపదే అడ్డుచెప్పడంతోనే విదేశాల్లో ఆమెకు వైద్యం అందించలేకపోయామని వైద్యులు తనతో అన్నారని ఆయన తెలిపారు. అమ్మ మృతికి ఆవిడే కారణమని తెలిసిన తరువాత ఆలస్యం చేయడం మంచిది కాదని తన సహచరులు హెచ్చరించడంతో తాను ఈ నెల 8న తన మద్దతుదారులతో నిరాహార దీక్షకు దిగుతున్నానని ఆయన తెలిపారు. శశికళ ముఖ్యమంత్రి అయితే ఎన్నికలకు వెళ్దామని చెప్పిన కొంత మంది పరిస్థితుల ప్రభావంతో నేడు మంత్రి వర్గ సభ్యులుగా కొనసాగుతున్నారని ఆయన తెలిపారు. కాగా, పొయెస్ గార్డెన్ లో జయలలితను కిందికి తోసేశారని, దీంతోనే ఆమె గాయపడి మృత్యువుకు చేరువయ్యారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

More Telugu News